
గురుగ్రామ్ లో ఓ టెన్నీస్ క్రీడాకారిణిని కన్న తండ్రే కాల్చి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. స్టేట్ లెవల్ టెన్నిస్ క్రీడాకారిణి, స్పోర్ట్స్ అకాడమీ నడుపుతున్న 25 సంవత్సరాల వయసు కలిగిన రాధికా యాదవ్ ను ఆమె తండ్రి దీపక్ యాదవ్ కాల్చి చంపాడు. తన కుమార్తె అకాడమీ నడిపించడాన్ని తండ్రి దీపక్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. అకాడమీ మూసివేయాలని గత కొంతకాలంగా ఆమెను ఒత్తిడి చేస్తూ వస్తున్నాడు.
ఈ క్రమంలో గురుగ్రామ్ సెక్టర్ 57లోని నివాసంలో ఉదయం సమయంలో ఆమె వంట చేస్తున్నప్పుడు , ఆమెపై తుపాకితో నేరుగా మూడుసార్లు కాల్పులు జరిపాడు. దీపక్ యాదవ్కు లైసెన్స్ ఉన్న రివాల్వర్ కలిగి ఉన్నాడు. ఆమెను వెనుక నుండి కాల్చినట్టు గూర్గావ్ పోలీసు ప్రతినిధి సందీప్ కుమార్ మీడియాకు తెలిపారు.
వజీరాబాద్ గ్రామానికి చెందిన దీపక్ యాదవ్ స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యవహారాలు నడిపిస్తున్నాడు. రియల్టర్గా పని చేస్తూ, అద్దెకు ఇల్లు కావాలంటే వారికి ఇప్పిస్తూ కమిషన్ తీసుకుంటాడు. అదే సమయంలో కుమార్తె రాధికా అదే గ్రామంలో స్పోర్ట్స్ అకాడమీ నడిపేది. గ్రామస్థులు కూతురు మీద ఆధారపడి జీవిస్తున్నావు అంటూ సూటి పోటి మాటలు అనడాన్ని తట్టుకోలేకపోయాడు. వారి మాటలు అతనికి ఏమాత్రం నచ్చకపోవడంతో అకాడమీ మూసివేయాలని ఆమెను ఒత్తిడి చేయసాగాడు. ఈ విషయంలో తండ్రీ కూతుళ్ల మధ్య తరచూ వాగ్వావివాదాలు జరిగేవి. ఈ క్రమంలోనే మరోసారి గొడవ జరిగింది. కోపంతో దీపక్ యాదవ్ ఆమెను కాల్చినట్టు సమాచారం అందుతోంది.