
Model United Nations 2025 : ప్రతి మనిషిలో దాగిన ఉన్న నాయకత్వ లక్షణాలను వెలికితీసేదే మోడల్ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమమని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ప్రతి మనిషిలోనూ ఒక నాయకుడు దాగి ఉంటాడని, మనం చేసే ఆలోచనలు, దృక్పథం మనలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయన్నారు. విలక్షణమైన ఆలోచనలే వాస్తవిక సమాజం అంచనా వేసే నేతలను రూపొందిస్తాయన్నారు.

అంతర్జాతీయ వ్యవహారాలపై అవగాహన పెంచే ఉద్దేశంతో నంబూరు వివాది స్కూల్ విద్యార్థులు నిర్వహించిన మోడల్ యునైటెడ్ నేషన్స్ (Model UN) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 360 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో భాగమైన భద్రతామండలి, ప్రతినిధుల సభ, అంతర్జాతీయ న్యాయస్థానం, ఆర్థిక & సాంఘిక మండలిల తరహాలో సభ్యులుగా వ్యవహరించి, ప్రపంచం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్లపై చర్చలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వివా చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ, విద్యార్థులకు గ్లోబల్ అంశాలపై అవగాహన కలిగించడం ద్వారా సమాజాన్ని చైతన్యవంతంగా మార్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. సమాజానికి మంచి చేసే సామర్థ్యం వారికి అలవడుతుందని ఇందుకు మోడల్ యునైటెడ్ నేషన్స్ లాంటి వేదికలు యువతకు దిశానిర్దేశం చేసేందుకు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ నైపుణ్యాలు, అనాలిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, గ్లోబల్ అవగాహన మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు.